Tuesday 13 September 2016

*వేదగణితం - ఒక కథ*

*వేదగణితం - ఒక కథ*
చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.
అప్పుడు ఆ రాజుగారు *ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా* *నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.*అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు *రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను* అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.
Read More
రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు *రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు!* అంటూ సున్నితంగాతిరస్కరించాడు.
*సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు!* అన్నాడు రాజుగారు.
*మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక* *గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు* *గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -* *నాలుగవ గడికి మళ్లి* *రెట్టింపు 8 గింజలు -*
*.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం.* అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.
రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.
ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.
తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు *పండితుడడి గాడు కదా.. మొదటి* *గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు..* *మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు..* *వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..*
*అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..*
*ఎందుచేత..?* అన్నాడు రాజుగారు.
*లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!*
*ఎందుకు..?* ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు
ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.
*అలాగా.. ఏమిటా పద్యం..?*
*ఇదుగో.. వినండి మహారాజా !*
శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు
నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
పద్యం విన్న మహారాజు *దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..*
*అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..*
‘సరే… సరే.. విప్పి చెప్పు..’
*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పద్యంలో
*శర, సాయక,* - అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.
*గగన, వియత్ - 0*
(ఆకాశం గగనం శూన్యం)
*శశి, చంద్ర, తుహినాంశు -1*(చంద్రుడొకడే భూమి కి )
*షట్కము - 6*
*రంధ్ర - 9*
(నవరంధ్రాలు)
*నగ, గిరి, భూధర - 7*
*అగ్ని - 3*
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
*అబ్ధి, పయోనిధి - 4*
*వేద -4*
(చతుర్వేదములు)
*తర్క - 6*
(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
*పద్మజాస్య - 4*
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
*కుంజర - 8*
(అష్ట దిగ్గజములు)
ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6 1 5
సాయక రంధ్ర వియత్
5 9 0
నగాగ్ని భూ
7 3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0 4 4 7
తర్క పయోనిధి
6 4
పద్మజాస్య కుం
4
జర తుహినాంశు
8 1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
*అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః"* - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..
అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
*1,84,46,74,40,73,70,95,51,615*
*ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615*
ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
*ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు* *ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,*
*4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు* *దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..*
*పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు..* అంటే *భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.*
పోనీ *లెక్కపెట్టడానికి ఎంత సమయం* *పడుతుందో అంటే*
*సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సం.।।లు...*
అదీ సంగతి…
వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… *నిజానికి అతడు చదివిన ఘనపనస* *కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే!* *ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు.* అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.
అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.
ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.
ఆ పండితుడు *రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు!* అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.
స్వస్తి

No comments:

Post a Comment